టెన్త్ ప్రతిభకు గీటురాయా? గ్రేడుపై పాత పాలసీయేనా?రద్దు నేపథ్యంలో అన్నీ ప్రశ్నలే
టెన్త్ ప్రతిభకు గీటురాయా?
గ్రేడుపై పాత పాలసీయేనా?
రద్దు నేపథ్యంలో అన్నీ ప్రశ్నలే
పదో తరగతి పరీక్షలను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం..మార్కులు, గ్రేడింగులు మాత్రం ఇస్తామని ప్రకటించడం విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిభ ఆధారంగా వీటిని కేటాయిస్తామని చెప్పడంపై విద్యార్థుల్లో ఒకింత ఆసక్తి, మరింత టెన్షన్ కనిపిస్తోంది. అసలు ప్రతిభను ఎలా గుర్తిస్తారంటూ ఉపాధ్యాయులను, విద్యాశాఖ వర్గాలను వారంతా ఆరా తీయడం కనిపించింది. 2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలోనే అంతర్గతంగా ఫార్మేటివ్ అసె్సమెంట్ (ఎఫ్.ఎ), సమ్మేటివ్ అసె్సమెంట్ (ఎస్.ఎ), ప్రీ పబ్లిక్ పరీక్షలను నిర్వహించారు.
మొత్తం మీద సబ్జెక్టుల వారీగా నాలుగు ఎఫ్.ఎ. పరీక్షలను (ఎఫ్.ఎ.-1, ఎఫ్.ఎ.-2,ఎ్ఫ.ఎ.-3, ఎఫ్.ఎ.-4) 50 మార్కులచొప్పున, ఎస్.ఎ.-1 పరీక్షలను 100 మార్కుల చొప్పున, ప్రీఫైనల్ పరీక్షలను 100 మార్కుల చొప్పున నిర్వహించారు. అంటే మొత్తం మీద పదో తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరంలో 400 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహించారన్నమాట. ఈ పరీక్షల్లో సాధించిన మార్కుల సగటును ప్రాతిపదికగా తీసుకుని...టెన్త్ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులకు మార్కులు ఇచ్చే వీలుంది.
అయితే ఇందులో ఒక చిక్కుంది. వీటిలో ఏ పరీక్షల మార్కులు అప్లోడ్ అయ్యాయో తొలుత తేల్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిలో వేటిని ఆధారంగా తీసుకోవలసిందీ నిర్ణయించాలి. అంటే, ఎఫ్.ఎ. మార్కులు, ఎస్.ఎ. మార్కుల ఆధారంగా తీసుకుంటారా లేక ప్రీఫైనల్లో సాధించిన మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారా లేక అన్ని పరీక్షల మార్కుల సగటును తీసుకుంటారా అన్న విషయాన్ని ప్రభుత్వం తేల్చవలసి ఉంటుంది. ఆ విధానం ఖరారుచేస్తే .. విద్యార్థులు తమ ఫలితాలను వెంటనే తెలుసుకోవచ్చు.
ఈ ఫలితాలను బట్టే.. ఏపీ ట్రిపుల్ ఐటీలు, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లకు విద్యార్థుల అర్హత నిర్ణయం అవుతుంది. సబ్జెక్టులు/పేపర్లవారీగా మార్కులు తేలితే .. వాటిని బట్టి గ్రేడ్లను నిర్థారించవచ్చు. ప్రస్తుతం ఉన్న విధానం ఇదే. దీనినే ప్రభుత్వం అనుసరించే వీలుంది. ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం .. ఫస్టియర్, సెకండియర్లో ఫెయిలైన వారిని కూడా పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఫెయిలైనవారికి మార్కులు ఎలా వేస్తారు? ఎన్ని వేస్తారు ? అన్న సందేహాలు విద్యార్థులను చుట్టుముడుతున్నాయి. ఫెయిలైనవారికి కనిష్ఠ మార్కులైన 35 మార్కులు వేస్తారని అంటున్నారు. మరి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల మార్కులు ఎలా నిర్థారిస్తారు? వంటి వాటిపై అధికారులను వివరణ కోరగా.. త్వరలోనే విధానం ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇస్తామన్నారు.

Comments
Post a Comment